IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం'

22 Mar, 2022 12:06 IST|Sakshi
Courtesy: IPL Twitter

రాజస్థాన్ రాయల్స్‌  కెప్టెన్ సంజు శాంసన్‌పై ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో  శాంసన్‌ ఒకడని అతడు కొనియాడాడు. అదే విధంగా శాంసన్‌ విద్వంసకర ఆటగాడు, తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలడు అని సంగక్కర తెలిపాడు. "శాంసన్‌ రాజస్థాన్ కెప్టెన్‌గానే కాకండా, ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అతను అద్భుతమైన ఆటగాడు, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడు.

అతడిలో మంచి ప్రతిభ ఉంది. నేను గత సీజన్‌లో బాధ్యతలు చేపట్టక ముందే అతడు రాజస్థాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. నేను జట్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత ఎక్కువ అతడి గురించి తెలుసుకున్నాను. అతడికి రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పట్ల మక్కువ ఎక్కువ. అతడు తన ఐపీఎల్‌ కెరీర్‌ను రాజస్థాన్‌తో ప్రారంభించాడు. అదే విధం‍గా అతడు కెప్టెన్సీ పరంగా కూడా అద్భుతమైన స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. 

ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగనుంది. కచ్చింతంగా అతడికి భారత్‌ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాను  అని సంగక్కర పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన శాంసన్‌ 484 పరుగులు సాధించాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మార్చి 29న తలపడనుంది.

చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్‌.. ఏకంగా ఆర్సీబీ తరపున!

మరిన్ని వార్తలు