సిరీస్‌పై ఇంగ్లండ్‌ కన్ను

21 Aug, 2020 03:32 IST|Sakshi

నేటి నుంచి పాక్‌తో చివరి టెస్టు  

మధ్యాహ్నం 3 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

సౌతాంప్టన్‌: కరోనా విరామం అనంతరం సొంత గడ్డపై వరుసగా రెండో టెస్టు సిరీస్‌పై గెలవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్‌... నేటి నుంచి పాకిస్తాన్‌తో ఆరంభమయ్యే చివరిదైన మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఇప్పటికే 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం దక్కకపోయినా... కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం కానుంది. మరో పక్క సిరీస్‌ తొలి టెస్టులో గెలుపు దారి నుంచి ఓటమి ఒడి చేరిన పాకిస్తాన్‌... ఈ మ్యాచ్‌లోనైనా సమిష్టిగా రాణించి సిరీస్‌ను ‘డ్రా’ చేయలానే పట్టుదలతో ఉంది. వర్షం, వెలుతురు లేమి సమస్యలతో రెండో టెస్టు 134.3 ఓవర్లు మాత్రమే సాగింది.

వెలుతురు సమస్యకు చెక్‌ పెట్టే పనిలో ఈ మ్యాచ్‌ షెడ్యూల్‌ కంటే అరగంట ముందుగానే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో రెండో స్థానానికి ఎగబాకుతుంది. వ్యక్తిగత కారణాలతో స్టార్‌ ఆల్‌రౌండ్‌ బెన్‌ స్టోక్స్‌ సిరీస్‌లోని దూరమైనా... ఇంగ్లండ్‌ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో పాకిస్తాన్‌ కంటే బలంగా కనిపిస్తోంది. రూట్‌ సారథ్యం ఆ జట్టుకు అదనపు బలం. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న జేమ్స్‌ ఆండర్సన్‌ రెండో టెస్టులో  లయ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు.

మరిన్ని వార్తలు