IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్‌'

7 Oct, 2022 09:50 IST|Sakshi

లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ శిఖర్ ధావన్ స్పందించాడు. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌లో చేయడంలో విఫలమం కావడం జట్టు ఓటమికి దారితీసిందని ధావన్‌ తెలిపాడు. కాగా ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు అఖరి ఓవర్‌లలో మాత్రం తెలిపోయారు. ప్రోటీస్‌ బ్యాటర్లు క్లసన్‌, మిల్లర్‌ బౌండరీల వర్షం కురిపించారు.

అఖరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. మిల్లర్‌, క్లసన్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారివిడిచారు. ఇందుకు భారత్‌ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.

ఇక బ్యాటింగ్‌లో కూడా టీమిండియా అంతగా రాణించలేకపోయింది. ధావన్‌, గిల్‌, కిషన్‌, గైక్వాడ్‌ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే సంజూ శాంసన్‌ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు.  ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న సంజూ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ధావన్‌ మాట్లాడుతూ.. "40 ఓవర్లకు 250 పరుగులు చిన్న లక్ష్యమేమి కాదు. స్వింగ్‌, స్పిన్‌ అయ్యే వికెట్‌పై మేము చాలా పరుగులు ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కూడా అంతగా రాణించలేకపోయాం. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పి‍ంచుకున్నాము. ఇక బ్యాటింగ్‌లో కూడా ఆరంభం మంచిగా లేదు.

కానీ సంజూ ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం అద్భుతమైనది. అఖరిలో శార్థూల్‌, సంజూ జట్టును గెలిపిస్తారని భావించాము. ఈ మ్యాచ్‌ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తాం" అని పేర్కొన్నాడు.
చదవండి: IND Vs SA: 'దటీజ్‌ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి'

మరిన్ని వార్తలు