LLC 2022: పార్థివ్‌ పటేల్‌ కీలక ఇన్నింగ్స్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ జెయింట్స్‌ విజయం

20 Sep, 2022 07:38 IST|Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. సోమవారం గుజరాత్‌ జెయింట్స్‌, మణిపాల్‌ టైగర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ రెండు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మణిపాల్‌ టైగర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రవికాంత్‌ శుక్లా 32 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్‌ కైఫ్‌ 24 పరుగులు చేశాడు. గుజరాత్‌ జెయింట్స్‌ బౌలర్లలో దిల్షాన్‌, దిండా రెండు వికెట్లు తీయగా.. ఎమ్రిత్‌, పెరీరా చెరొక వికెట్‌ తీశారు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయిం‍ట్స్‌ 17.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. పార్థివ్‌ పటేల్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. తిసారా పెరీరా 22, కెవిన్‌ ఒబ్రెయిన్‌ 23 పరుగులు చేశారు. లక్ష్యం తక్కువగా ఉన్నప్పటికి గుజరాత్‌ జెయింట్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో చివర్లో ఉత్కంఠ నెలకింది. కానీ పెరీరా 4 ఫోర్లు బాది జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. మణిపాల్‌ టైగర్స్‌ బౌలర్లలో క్రిస్‌ మోఫూ, పర్వీందర్‌ ఆవానా, హర్భజన్‌ సింగ్‌, ముత్తయ్య మురళీధరన్‌ తలా రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు