పీఎస్‌జీ తరఫున లాస్ట్‌ మ్యాచ్‌ ఆడేసిన మెస్సీ

5 Jun, 2023 09:51 IST|Sakshi

స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ పారిస్‌ సెయింట్‌-జెర్మైన్‌ (PSG) క్లబ్‌ తరఫున తన ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ.. క్లెర్మాంట్‌ క్లబ్‌ చేతిలో 2-3 గోల్స్‌ తేడాతో ఓటమిపాలైంది. మెస్సీతో పాటు సెర్గియో రామోస్‌కు కూడా పీఎస్‌జీ తరఫున ఇదే చివరి మ్యాచ్‌. తొలి అర్ధ భాగంలో పీఎస్‌జీ తరఫున రామోస్‌, ఎంబపె చెరో గోల్‌ సాధించగా.. క్లెర్మాంట్‌ తరఫున జోహన్‌ గస్టీన్‌, మెహ్ది జెఫ్ఫానే గోల్స్‌ చేశారు.

అనంతరం సెకెండ్‌ హాఫ్‌లో (63వ నిమిషం) గ్రెజాన్‌ కై గోల్‌ చేసి క్లెర్మాంట్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇదే లీడ్‌ చివరి వరకు కొనసాగడంతో క్లెర్మాంట్‌.. పీఎస్‌జీపై విజయం సాధించింది. సెకెండ్‌ హాఫ్‌లో మెస్సీకి రెండు గోల్స్‌ చేసే అవకాశం (ఫ్రీ కిక్‌) వచ్చినా, అవి వర్కౌట్‌ కాలేదు. మొత్తంగా ప్రస్తుత తరంలో ఫుట్‌బాల్‌ దిగ్గజాలుగా చెప్పుకునే మెస్సీ, రామోస్‌ ఓటమితో పీఎస్‌జీకి వీడ్కోలు పలికారు.

కాగా, మెస్సీ.. సౌదీ అరేబియాకు చెందిన అల్‌ హిలాల్‌ క్లబ్‌తో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అల్‌ హిలాల్‌ ప్రకటిస్తుందని తెలుస్తోంది. మెస్సీ సహచరుడు, పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సైతం​ సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

చదవండి: జొకోవిచ్‌ రికార్డు

మరిన్ని వార్తలు