Legends League Cricket 2022: లెజెండ్స్‌ లీగ్‌లో అదరగొట్టారు.. ఎవరీ పంకజ్‌ సింగ్‌, తన్మయ్‌ శ్రీవాత్సవ?

17 Sep, 2022 13:08 IST|Sakshi

టీమిండియా జట్టుకు ఆడాలని ప్రతీ క్రికెటర్‌ కలగనడం సహజం. కానీ తుది జట్టులో 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నప్పటికి కొందరు అనామక క్రికెటర్లుగా మిగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం జెంటిల్‌మెన్‌ గేమ్‌ అని చెప్పుకునే క్రికెట్‌లో నీచ రాజకీయాల వల్ల ఆటకు దూరం కావాల్సి వస్తుంది. గతంలో జరిగింది.. ఇప్పుడు జరుగుతుంది.. ఇకపై కూడా ఇలాంటి రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి.

అందుకు సంజూ శాంసన్‌ చక్కటి ఉదాహరణ. మంచి బ్యాటింగ్‌ టెక్నిక్‌ గల సంజూ శాంసన్‌కు టి20 ప్రపంచకప్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. అతన్ని ఎంపిక చేయకపోవడంపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడంటే ఐపీఎల్‌ లాంటి క్రికెట్‌ లీగ్స్‌తో జాతీయ జట్టుకు ఆడకపోయినా దండిగానే డబ్బులు సంపాదిస్తున్నారు.

తాజాగా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా ఇండియా మహారాజాస్‌కు ఆడిన పంకజ్‌ సింగ్‌, తన్మయ్‌ శ్రీవాత్సవలు అద్బుత ప్రదర్శన చేశారు. పంకజ్‌ సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగి బౌలింగ్‌లో అదరగొడితే.. మరొకరు బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించి క్లాస్‌ ప్రదర్శన చేశాడు. అద్భుత ప్రదర్శనతో పంకజ్‌ సింగ్‌, తన్మయ్‌ శ్రీవాత్సవలు తమ గురించి మాట్లాడుకునేలా చేశారు.

ఎవరీ పంకజ్ సింగ్? 


ఉత్తరప్రదేశ్‌కి చెందిన పంకజ్ సింగ్, టీమిండియా తరుపున 2 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన పంకజ్, శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో వికెట్ తీయలేక జట్టులో చోటు కోల్పోయాడు. తన రెండో టెస్టులో పంకజ్ సింగ్ జో రూట్, జోస్ బట్లర్‌లను ఔట్‌  చేశాడు . మొదటి మ్యాచ్‌లో పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అలిస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు.

ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన పంకజ్‌.. అరంగ్రేట మ్యాచ్‌లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంకజ్‌ సింగ్‌ ఏకంగా 179 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం పంకజ్ సింగ్‌కి ఘనమైన రికార్డు ఉంది. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పంకజ్ సింగ్ 472 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. 76 లిస్టు ఏ మ్యాచ్‌లో 115 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌ ద్వారా పరిచయం..


పంకజ్ సింగ్‌తో పాటు తన్మయ్ శ్రీవాస్తవ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఇండియా మహారాజాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన తన్మయ్.. ఐపీఎల్‌లో మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు.34 మ్యాచుల్లో 649 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తన్మయ్ శ్రీవాస్తవ 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు.లిస్టు ఏ క్రికెట్‌లో 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేసిన తన్మయ్... 2020లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

చదవండి: పఠాన్‌ బ్రదర్స్‌ విధ్వంసం.. ఇండియా మహారాజాస్‌ ఘన విజయం

'మొన్ననే కదా ఫైనల్‌ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'

>
మరిన్ని వార్తలు