Legends League Cricekt 2022: గెలిపించిన షేన్‌ వాట్సన్‌.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్‌

4 Oct, 2022 07:52 IST|Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా బిల్వారా కింగ్స్‌ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్‌-2 మ్యాచ్‌లో బిల్వారా కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్‌ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.ఓపెనర్లు విలియం పోర్టర్‌ఫీల్డ్ (43 బంతుల్లో 60 పరుగులు), మోర్నీ వాన్‌విక్‌ 31 పరుగులు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌(24 బంతుల్లో 48 నాటౌట్‌) చివరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఆఖర్లో పఠాన్‌ బ్రదర్స్‌ యూసఫ్‌ పఠాన్‌(21), ఇర్ఫాన్‌ పఠాన్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెవిన్‌ ఓబ్రియాన్‌ 45, యశ్‌పాల్‌ సింగ్‌ 43, తిలకరత్నే దిల్షాన్‌ 36 పరుగులు చేశారు. బిల్వారా కింగ్స్‌ బౌలర్లలో శ్రీశాంత్‌ 2, పనేసర్‌, ఎడ్వర్ట్స్‌, బ్రెస్నన్‌, త్యాగిలు తలా ఒక వికెట్‌ తీశారు. ఇక అక్టోబర్‌ 8న(శనివారం) ఇండియా క్యాపిటల్స్‌తో జరగనున్న ఫైనల్లో బిల్వారా కింగ్స్‌ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆదివారం(అక్టోబర్‌ 2న) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఇండియా క్యాపిటల్స్‌ చేతిలో బిల్వారా కింగ్స్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

చదవండి: యూసఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ల గొడవ.. అంపైర్‌ తలదూర్చినా!

మరిన్ని వార్తలు