LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్‌ ఘన విజయం

22 Sep, 2022 09:34 IST|Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2022లో ఇండియా క్యాపిటల్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి బిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్‌ 78 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు భారీ స్కోరు చేసింది. జింబాబ్వే ఆటగాడు సొలొమన్‌ మైర్‌ (38 బంతుల్లో 82 పరుగులు, 7 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. మరో జింబాబ్వే బ్యాటర్‌ మసకద్జా 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ రామ్‌దిన్‌ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బిల్వారా కింగ్స్‌ బౌలర్లలో యూసఫ్‌ పఠాన్‌ మూడు వికెట్లు తీయగా.. బెస్ట్‌, టిమ్‌ బ్రెస్నన్‌ చెరొక వికెట్‌ తీశారు.

అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్‌ 19.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్‌ అయింది. తన్మయ్‌ శ్రీవాత్సవ 27 పరుగులు నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. నమన్‌ ఓజా 20 పరుగులు చేశాడు. ఇండియా క్యాపిటల్స్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో బిల్వారా కింగ్స్‌ బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఇండియా క్యాపిటల్స్‌ బౌలర్లలో రజత్‌ బాటియా, ప్రవీణ్‌ తాంబే, పంకజ్‌ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు