LLC 2022: ఇండియా మహరాజాస్‌ కెప్టెన్‌గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం!

12 Aug, 2022 13:38 IST|Sakshi
సౌరవ్‌ గంగూలీ- ఇయాన్‌ మోర్గాన్‌(P​hoto Credit: Legends Cricket League)

Sourav Ganguly- September 15th in Legends League Cricket Match: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022 తాజా సీజన్‌ ఓ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం)లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో సెప్టెంబరు 15న జరిగే ఈ మ్యాచ్‌లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. 

కాగా టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడనే సంగతి తెలిసిందే. అయితే, ఫండ్‌ రైజింగ్‌ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌కు దాదా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఇక వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహించనున్నాడు.

దాదా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్‌ జెయింట్స్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం లెండిల్‌ సిమన్స్‌, ప్రొటిస్‌ మాజీ ప్లేయర్‌ హర్షల్‌ గిబ్స్‌, శ్రీలంక లెజెండ్‌ సనత్‌ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది.

ఇండియా మహరాజాస్‌ జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌,యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ, ఎస్‌ శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.

వరల్డ్‌ జెయింట్స్‌ జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), లెండిల్‌ సిమన్స్‌, హర్షల్‌ గిబ్స్‌, జాక్వస్‌ కలిస్‌, సనత్‌ జయసూర్య, మాట్‌ ప్రియర్‌(వికెట్‌ కీపర్‌), నాథన్‌ మెకల్లమ్‌, జాంటీ రోడ్స్‌, ముత్తయ్య మురళీధరన్‌, డేల్‌ స్టెయిన్‌, హోమిల్టన్‌ మసకజ్ద, మష్రాఫ్‌ మోర్తజా, అస్గర్‌ అఫ్గన్‌, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌ లీ, కెవిన్‌ ఒ బ్రెయిన్‌, దినేశ్‌ రామ్‌దిన్‌(వికెట్‌ కీపర్‌).

6 పట్టణాల్లో 22 రోజులు.. 15 మ్యాచ్‌లు
ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సీజన్‌-2లో టైటిల్‌ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఉంటాయి.

ఆరు పట్టణాల్లో 22 రోజుల పాటు అక్టోబరు 8 వరకు లీగ్‌ సాగనుంది. జట్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక భారత 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ ఎడిషన్‌ను అంకితమిస్తున్నట్లు లీగ్‌ కమిషనర్‌ రవిశాస్త్రి తెలిపాడు.కాగా మొదటి సీజన్‌ను వరల్డ్‌ జెయింట్స్‌ గెలిచిన విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌! ఇక కష్టమే!

A post shared by Legends League Cricket (@llct20)

మరిన్ని వార్తలు