WTC Finals In Lords Stadium: 'క్రికెట్‌ మక్కా' వేదికగా 2023, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌

27 Jul, 2022 10:28 IST|Sakshi

క్రికెట్‌ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్‌ స్టేడియం మరో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023, 2025లో జరగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లకు లార్డ్స్‌ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు మంగళవారం(జూలై 26) బర్మింగ్‌హమ్‌ వేదికగా నిర్వహించిన చివరి రోజు వార్షిక సమావేశాల్లో ఐసీసీ పేర్కొంది. వాస్తవానికి 2019-21 తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ కూడా లార్డ్స్‌లో జరగాల్సింది.

కానీ కరోనా కారణంగా ఆఖరి క్షణంలో వేదికను సౌతాంప్టన్‌కు మార్చాల్సి వచ్చింది.  దీంతో పాటు వార్షిక సమావేశాల్లో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక  2021 జూన్‌ 18 నుంచి 23 వరకు తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగింది. ఈ ఫైనల్లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి టెస్టు చాంపియన్‌గా అవతరించింది.

ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీలో వివిఎస్‌ లక్ష్మణ్‌తో పాటు కివీస్‌ మాజీ క్రికెటర్‌ డానియెల్‌ వెటోరిని ఆటగాళ్ల ప్రతినిధులుగా నియమించింది.
ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ కారణంగా రష్యా క్రికెట్‌ మెంబర్‌షిప్‌ను ఐసీసీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేసింది. దీంతోపాటు ఉక్రెయిన్‌కు క్రికెట్‌లో సభ్యత్వం ఇవ్వడానికి ఐసీసీ కమిటీ ఆమోదం తెలిపింది.
2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది.
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.ముందుగా 2024లో బంగ్లాదేశ్‌ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్‌ మెగా ఈవెంట్‌ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్‌ ఇంగ్లండ్‌లో జరుగుతుంది.

చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్‌ లక్ష్మణ్‌కు కీలక పదవి

మరిన్ని వార్తలు