Asia Cup 2022: 'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం'

5 Aug, 2022 15:37 IST|Sakshi

ఆసియా కప్‌-2022లో భాగంగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా తలపడనుంది. అయితే గతేడాది ఇదే వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ఎక్కడ అయితే ఓటమి చవిచూసిందో అక్కడే దానికి బదులు తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. అయితే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ కీలక వాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్-2021లో పాక్‌ చేతిలో ఓటమి భారత్‌ను బాగా దెబ్బతీసిందని లతీఫ్‌ అన్నాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో లతీఫ్‌ మాట్లాడుతూ.. "ప్రపంచకప్ ఓటమి భారత జట్టు మైండ్‌లో ఉంటుందని నేను అనుకోవడంలేదు. టీమిండియా ప్రస్తుతం ప్రతీ సిరీస్‌లోను విజయం సాధిస్తోంది. అదే విధంగా ప్రతీ సిరీస్‌లోనూ వారి జట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అయినప్పటికీ భారత్‌ వెనుకంజ వేయడం లేదు. ప్రస్తుతం టీమిండియా దృష్టింతా ఆసియాకప్‌ పైనే ఉంది. అయితే గతేడాది పాకిస్తాన్ చేతిలో ఓటమి మాత్రం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే వారు తమ లోపాలను సవరించుకుని ముందుకు సాగుతున్నారు. కాగా పాక్‌, భారత్‌ జట్లు వేర్వేరుగా చాలా సిరీస్‌లు ఆడవచ్చు. కానీ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అం‍టే నరాలు తెగే ఉత్కంఠత ఉంటుంది. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పై భారత జట్టుతో పాటు, బీసీసీఐ కూడా ప్రత్యేక శ్రద్ద చూపుతుందని భావిస్తున్నాను.

కీలక ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉంటే ఆసియా కప్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా ఉంటుంది. యూఏఈలో పరిస్థితులు కూడా టీమిండియాకు కూడా అనుకూలంగా ఉంటాయి. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ తన సత్తా చాటడం ఖాయం.  గత  20 ఏళ్లగా ఇరు జట్ల  మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ లలో భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్నది. అయితే పాకిస్తాన్‌ తమ చివరి మ్యాచ్‌లో  10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది" అని పేర్కొన్నాడు.
చదవండిWC 2022: ఓపెనర్‌గా పంత్‌, ఇషాన్‌.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే!

మరిన్ని వార్తలు