World Boxing Championships: క్వార్టర్‌ ఫైనల్లో సాక్షి, లవ్లీనా

21 Mar, 2023 08:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాక్షి చౌధరీ (52 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రీతి (54 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో సాక్షి 5–0తో జజీరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్‌)పై, లవ్లీనా 5–0తో వనెసా ఒరిట్జ్‌ (మెక్సికో)పై ఏకపక్ష విజయాలు నమోదు చేశారు.

ప్రీతి 3–4తో జిట్‌పోంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. మరో బౌట్‌లో విజయం సాధిస్తే సాక్షి, లవ్లీనాకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో సుమయె కొసిమోవా (తజికిస్తాన్‌)తో నీతూ (48 కేజీలు), తుర్హాన్‌ ఎలిప్‌ నూర్‌ (తుర్కియే)తో మనీషా (57 కేజీలు), కిటో మాయ్‌ (జపాన్‌)తో శశి చోప్రా (63 కేజీలు), ఫాతిమా హెరెరా అల్వారెజ్‌ (మెక్సికో)తో నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), నవ్‌బాఖోర్‌ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్‌)తో మంజు బంబోరియా (66 కేజీలు), మిజ్‌గోనా సమదోవా (తజికిస్తాన్‌)తో జాస్మిన్‌ (60 కేజీలు) తలపడతారు.
చదవండి: Race Walking Championship 2023: అక్ష్‌దీప్‌ సింగ్‌కు స్వర్ణం

మరిన్ని వార్తలు