గంగూలీకి దీదీ శుభాకాంక్షలు.. ఇంటికెళ్లి మరీ విష్‌ చేసిన బెంగాల్ సీఎం

8 Jul, 2021 20:50 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదా ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపు గడిపిన దీదీ.. గంగూలీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు. ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతాగా పిలువబడే గంగూలీని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఇంటికెళ్లి మరీ విష్‌ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గంగూలీ రాజకీయ అరంగేట్రం చేస్తాడని టీఎంసీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.  అయితే దాదా బీజేపీతో సైతం క్లోజ్‌గానే మూవ్‌ అవుతుంటాడు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు, బీసీసీఐ జనరల్‌ సెక్రెటరీ జై షాతో కలిసి దగ్గరగా పనిచేస్తుంటాడు. 

ఇదిలా ఉంటే, గంగూలీ.. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిరాఢంబరంగా జరుపుకున్నాడు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్‌, యూరోకప్‌, కోపా అమెరికా ఫుట్‌బాల్‌, ఒలింపిక్స్‌కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మరోవైపు దాదాకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయను విషెస్ తెలియజేశారు. భారత్ తరఫున 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడిన దాదా.. రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆయన.. 97 మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలనందించి భారత దేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.

మరిన్ని వార్తలు