రోహిత్‌, విరాట్‌లను తిట్టాడని స్నేహితుడినే చంపేశాడు..!

13 Oct, 2022 20:28 IST|Sakshi

సినిమా స్టార్ల అభిమానుల మధ్య గొడవలు జరగడం, కొన్ని సందర్భాల్లో శుత్రి మంచి హత్యలు జరగడం అప్పుడప్పుడూ మనం చూస్తూ ఉంటాం. తాజాగా జరిగిన ఓ ఉదంతంలో ఓ క్రికెట్‌ అభిమాని.. తన ఆరాధ్య క్రికెటర్లను దూషించాడని తన స్నేహితుడినే అంతమొందించాడు. ఈ దారుణం తమిళనాడులోని అరియలూరు జిల్లాలో చోటు చేసుకుంది.

తన ఫేవరెట్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను దూషించాడనే కారణంతో స్నేహితుడిని కొడవలితో అతి  కిరాతకంగా నరికి చంపేసాడు ఓ క్రికెట్ అభిమాని. తమిళ మీడియా కథనాల మేరకు.. గత గురువారం చోటు చేసుకున్నట్లు చెబుతున్న ఈ  ఘటనలో నిందితుడు, చనిపోయిన వ్యక్తి ఇద్దరు మంచి స్నేహితులని తెలుస్తోంది.

వీరిద్దరు మద్యం సేవిస్తుండగా క్రికెట్‌ గురించి చర్చ వచ్చిందని, ఈ సందర్భంగా మృతుడు.. క్రికెటర్లు రోహిత్‌ శర్మను, విరాట్‌ కోహ్లిని బూతులు తిట్టాడని సమాచారం. తన అభిమాన క్రికెటర్లను తిట్టడాన్ని సహించలేకపోయిన నిందితుడు.. తన స్నేహితుడిని కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడని తెలుస్తోంది. విషయం తెలిసి స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం.

ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్‌ అభిమానులు ఈ దురదృష్ట ఘటనను ఖండిస్తున్నారు. చంపుకునేంత రాక్షస అభిమానమేంటని ప్రశ్నిస్తున్నారు. అభిమానం మంచిదేనని, మద్యమే ఇలాంటి అనర్ధాలకు కారణమని వాపోతున్నారు. కాగా, గతంలో కూడా పలు సందర్భాల్లో టీమిండియా స్టార్‌ క్రికెటర్ల అభిమానుల మధ్య గొడవలు జరిగిన ఉదంతాలు మనం చూశాం. అయితే, ఈ స్థాయిలో చంపుకునేంతవరకు ఎప్పుడు వెళ్లలేదు. 

మరిన్ని వార్తలు