IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్‌ పాండే..?

24 Dec, 2021 11:55 IST|Sakshi

Manish Pandey Likely To Replace Virat Kohli As RCB Captain: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారధ్య బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో ఆ జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా కోహ్లి సహా మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్సీ, సిరాజ్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, అనూహ్యంగా ఆర్సీబీ కెప్టెన్సీ రేసులోకి మనీశ్‌ పాండే వచ్చాడు. 

దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్‌ రికార్డు కలిగిన మనీశ్‌ పాండేను ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ఫ్రాంఛైజీ అభిమానులను నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మనీశ్‌కే పగ్గాలు అప్పజెప్పాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. మనీశ్‌ 2009లో ఆర్సీబీ తరఫున ఆడుతూ ఐపీఎల్‌లో తొలి శతకం బాదిన భారత అటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని కూడా ఆర్సీబీ యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇవే కాకుండా స్వతహాగా కర్ణాటక వాసి కావడం, అలాగే ఐపీఎల్‌లో మంచి ట్రాక్‌ రికార్డు కలిగి ఉండటాన్ని సైతం యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. మనీశ్‌ ఇప్పటివరకు 154 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 30.68 సగటుతో 3560 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, ఆర్సీబీ సారధిగా మనీశ్‌తో పాటు ఆసీస్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు సైతం అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరిలో జరిగే మెగా వేలం వరకు ఎదురు చూడాల్సిందే.
చదవండి: ఐపీఎల్‌ మెగా వేలానికి డేట్స్‌ ఫిక్స్‌!

మరిన్ని వార్తలు