అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు

13 Jan, 2022 23:40 IST|Sakshi

దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌ టీమిండియా ఆటగాళ్లతో వైరం కొనసాగిస్తున్నాడు. బుమ్రాతో వైరం పెట్టుకొని జాన్సెన్‌ ఫలితం అనుభవించాడు. దాని నుంచి బయటపడకముందే తన కవ్వింపు చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మార్కో జాన్సెన్‌ తన వైరం పంత్‌తో పెట్టుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో ఓపికతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న పంత్‌కు మార్కో జాన్సెన్‌ షార్ట్‌ పిచ్‌ బంతి వేశాడు. పంత్‌ దానిని ఢిఫెన్స్‌ ఆడగా.. బంతిని అందుకున్న జాన్సెన్‌ కోపంతో పంత్‌వైపు విసిరి కవ్వించాడు. అసలే ఉడుకురక్తంతో కనిపించే పంత్‌ను గెలకడం కాస్త ఆసక్తి కలిగించింది.

అయితే పంత్‌ మాత్రం తన శైలికి విరుద్ధంగా బంతికి బ్యాట్‌ను అడ్డుపెట్టి గాయం కాకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో వీరిమధ్య ఏదైనా గొడవ జరుగుతుందేమోనని అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్‌ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పటికి.. ఒకవేళ​ ప్రొటీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మార్కో జాన్సెన్‌ బ్యాటింగ్‌కు వస్తే.. వికెట్ల వెనకాల పంత్‌ కీపర్‌గా ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక 212 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు ఆఖరి బంతికి ఎల్గర్‌(30) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌కు ఇచ్చి ఎల్గర్‌ వెనుదిరిగాడు. క్రీజ్‌లో కీగన్‌ పీటర్సన్‌(48) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 111 పరుగులు అవసరం కాగా, టీమిండియా 8 వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. 

మరిన్ని వార్తలు