ఇటలీ పర్యటనకు మేరీకోమ్‌ దూరం

8 Oct, 2020 05:39 IST|Sakshi

ఈనెల 15 నుంచి భారత బాక్సర్ల ప్రాక్టీస్‌

న్యూఢిల్లీ: భారత బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాలు మొదలు కానున్నాయి. నాణ్యమైన ప్రాక్టీస్‌ కోసం బాక్సర్లను ఇటలీ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 28 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళా బాక్సర్లతో పాటు సహాయ సిబ్బంది వచ్చే వారం ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు 52 రోజుల శిక్షణకు అవసరమయ్యే రూ. 1.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 5 వరకు ఇటలీలోని అసిసి నగరంలో జరిగే ఈ శిబిరానికి దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌తోపాటు మరో ఇద్దరు బాక్సర్లు పాల్గొనడం లేదు.

డెంగ్యూ కారణంగా మేరీకోమ్, గాయం నుంచి కోలుకుంటోన్న మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) ... అమెరికాలో ప్రాక్టీస్‌ చేస్తోన్న కారణంగా వికాస్‌ (69 కేజీలు) ఈ పర్యటనకు గైర్హాజరు కానున్నారు. అనారోగ్యం తగ్గాక ఢిల్లీలోనే ప్రాక్టీస్‌ చేస్తానని మేరీకోమ్‌ చెప్పింది. ‘డెంగ్యూతో బాధపడుతున్నా. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ప్రయాణించే ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ప్రాక్టీస్‌ చేస్తా’ అని మేరీ తెలిపింది. ఒలింపిక్స్‌ పతకావకాశాలున్న అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు), ఆశిష్‌ (75 కేజీలు), సతీశ్‌ (ప్లస్‌ 91 కేజీలు), సిమ్రన్‌ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు.

మరిన్ని వార్తలు