IPL 2023: పంజాబ్‌, లక్నో మ్యాచ్‌కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా!

28 Apr, 2023 18:45 IST|Sakshi
Photot: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శుక్రవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు ముప్పు పొంచి ఉంది. వర్షం ముప్పు మాత్రం కాదు. కానీ ప్రస్తుతం అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.  అసలు మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానం కూడా ఉంది. విషయంలోకి వెళితే.. పంజాబ్‌, లక్నో మ్యాచ్‌కు నిహంగ్ సిక్కుల నుంచి ముప్పు పొంచి ఉండడమే దీనికి కారణం.

పంజాబ్ కొన్ని రోజులుగా నిహంగ్ సిక్కుల ఆందోళన జరుగుతోంది. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ వీళ్లు నిరసన తెలుపుతున్నారు. నిహంగ్ సిక్కుల ఛీఫ్ బాపు సూరత్ సింగ్ ఖల్సా నిరాహార దీక్ష చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన దీక్షలోనే ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ద్వారా వీళ్లు తమ నిరసన తీవ్రత ఎంతో తెలియజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం అందింది.

తమ డిమాండ్లు పంజాబ్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకుంటామని కూడా ఇప్పటికే వాళ్లు అక్కడి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పంజాబ్, లక్నో మ్యాచ్ కు వీళ్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఒకవేళ వీళ్ల నిరసన కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేస్తే.. పంజాబ్, లక్నో జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు.

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో ఉంది. ఏడు మ్యాచ్ లలో 4 గెలిచి, 3 ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ ల నుంచి శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కాగా ధావన్‌ నేడు లక్నోతో మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ వారం రోజుల తర్వాత మరో మ్యాచ్ ఆడుతోంది.గుజరాత్‌ టైటాన్స్‌తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 4 వికెట్లు పారేసుకొని ఓటమిని కొనితెచ్చుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

చదవండి: స్వదేశానికి కేకేఆర్‌ క్రికెటర్‌.. ఆడింది ఒక్కటే మ్యాచ్‌!

మరిన్ని వార్తలు