Dinesh Karthik: 'అవమానించాలని కాదు.. అసలు దినేశ్‌ కార్తిక్‌ రోల్‌ ఏంటి?'

22 Sep, 2022 13:40 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు ఫినిషర్‌ అనే ట్యాగ్‌ తగిలించి బీసీసీఐ అతనికి జట్టులో చోటు కల్పించింది. ఈ ఏడాది  ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున కార్తిక్‌ ఫినిషర్‌గా అదరగొట్టాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌ల్లో టీమిండియా తరపున ఫినిషింగ్‌ పాత్రలో మెరిశాడు. ఇక ధోని తర్వాత సరైన ఫినిషర్‌ దొరికాడు అని అభిమానులు భావించేలోపే అతని స్థానాన్ని బీసీసీఐ ప్రశ్నార్థకం చేసింది.

ఫినిషర్‌ అంటే చివరగా వచ్చి ధాటిగా ఆడడం అని అందరికి తెలుసు. ఐపీఎల్‌ తర్వాత టీమిండియా ఆడిన ప్రతీ టి20 సిరీస్‌కు కార్తిక్‌ను ఎంపిక చేస్తూ వచ్చింది. కానీ తుది జట్టులో మాత్రం అవకాశాలు తక్కువగా వచ్చేవి. ఒకవేళ జట్టులో చోటు దక్కినా ఎ‍క్కడో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. మరి బీసీసీఐ ఫినిషర్‌ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో అక్షర్‌ పటేల్‌ తర్వాత దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్‌ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక ఫినిషర్‌ అని పేర్కొని ఆరో స్థానంలో పంపకుండా.. అక్షర్‌ పటేల్‌ తర్వాత పంపడం ఏంటని విరుచుకుపడ్డారు. కార్తిక్‌ క్రీజులోకి వచ్చే సమయానికి పట్టుమని పది బంతులు కూడా ఉండడం లేదు. తొలి బంతినే హిట్టింగ్‌ చేయాలనడం కరెక్ట్‌ కాదు.. ఏ బ్యాటర్‌ అయినా కుదురుకోవడానికి రెండు, మూడు బంతులు తీసుకుంటాడు. మరి అలా చూసుకుంటే కార్తిక్‌కు అసలు కుదురుకోవడానికి టైం కూడా ఉండడం లేదు. ఇక ఫినిషర్‌ పాత్రకు ఎలా న్యాయం చేయగలడు. 

ఇదే విషయమై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ మాథ్యూ హెడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' దినేశ్‌ కార్తిక్‌ను అవమానించాలని కాదు.. అసలు అతని రోల్‌ ఏంటనేది నాకు క్లారిటీ లేదు. ఫినిషర్‌ అనేవాడు పూర్తిస్థాయి బ్యాటర్స్‌ ఔటైన తర్వాత బరిలోకి దిగుతారు. కానీ ఆల్‌రౌండర్‌ తర్వాత కార్తిక్‌ బ్యాటింగ్‌కు రావడం అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇలా చేస్తే రోహిత్‌ స్ట్రాటజీ వర్క్‌వుట్‌ కాదు. అందుకోసం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కార్తిక్‌కు ప్రమోషన్‌ ఇవ్వాల్సిందే. టి20 ప్రపంచకప్‌ వరకు కార్తిక్‌కు ఇచ్చిన ఫినిషర్‌ రోల్‌ను సమర్థంగా వాడుకోవాలి.''  అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్‌, బౌలింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న రెండో టి20లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని టీమిండియా భావిస్తోంది. ఇక రెండో టి20 కోసం నాగ్‌పూర్‌ చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. 

చదవండి: Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మినహా వాళ్లంతా వేస్ట్‌! అధిక బరువు కారణంగా..

కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త

మరిన్ని వార్తలు