అతడు గొప్ప కెప్టెన్‌.. మళ్లీ అవకాశం వస్తే: వేడ్‌

7 Dec, 2020 20:02 IST|Sakshi

సిడ్నీ: ‘‘ స్మిత్‌, మోజెస్‌ హెన్రిక్స్‌(బీబీఎల్‌ టీం సారథి) వంటి ఎంతో మంది గొప్ప నాయకులు, అనుభవజ్ఞులు మా జట్టులో ఉన్నారు.  ఫించీ మా కెప్టెన్‌. తను బాగా ఆడితే మేం కూడా మెరుగ్గా రాణిస్తాం. నిజానికి స్మిత్‌ కూడా గొప్ప కెప్టెన్‌. సుదీర్ఘకాలం పాటు సారథిగా సేవలు అందించాడు. మళ్లీ అవకాశం వస్తే అంతే గొప్పగా జట్టును ముందుండి నడిపిస్తాడు. అయినప్పటికీ నాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. సీనియర్లంతా చాలా సేపు చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా మేమంతా ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటాం. సమిష్టిగా ఆడతాం’’ అని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ వేడ్‌ అన్నాడు. ఆదివారమిక్కడ టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆరోన్‌ ఫించ్‌ గాయపడటంతో అతడు కెప్టెన్సీ బాధ్యతలు వేడ్‌ తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు: మెక్‌గ్రాత్‌)

ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా విఫలమైనా వ్యక్తిగతంగా మెరుగ్గానే రాణించాడు. భారత బౌలర్లను వేటాడుతూ.. వరుస బౌండరీలు బాదుతూ... 25 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శన గురించి వేడ్‌ మాట్లాడుతూ.. ‘‘అవును.. నాకిప్పుడు 32 ఏళ్లు. చాలా కాలం నుంచి క్రికెట్‌ ఆడుతున్నా. అయితే నేనొక డిఫరెంట్‌ ప్లేయర్‌ను అని చెప్పగలను. అవును.. మాథ్యూ వేడ్‌ వికెట్‌ కీపర్‌- బ్యాటర్‌. గతంలో కంటే ఎంతో భిన్నంగా ఆడుతున్నాడు. మూడేళ్లుగా తన ఆట తీరులో మార్పు వచ్చింది. రెండేళ్ల క్రితం కెరియర్‌ని రీస్టార్డ్‌ చేసిన ఫీలింగ్‌ తనది. ముప్పైవ ఏట మరోసారి అరంగేట్రం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో  ఆసీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన కోహ్లి సేన సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బాల్‌ టాంపరింగ్‌ వివాదం చోటుచేసుకోవడంతో స్మిత్‌కు కెప్టెన్‌గా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.(చదవండిధావన్‌.. నేను ధోనిని కాదు: వేడ్‌)

మరిన్ని వార్తలు