IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్‌.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్‌

19 May, 2022 20:46 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. బ్యాట్స్‌మన్‌ రివ్యూలు తీసుకున్నప్పటికి డీఆర్‌ఎస్‌లు సరిగా పనిచేయక ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.  16 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ థర్డ్‌ అంపైర్‌ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ మ్యాక్స్‌వెల్‌ వేశాడు. ఓవర్‌ రెండో బంతిని స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లను తాకింది. దీంతో ఆర్‌సీబీ అప్పీల్‌ వెళ్లగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. అయితే వేడ్‌ వెంటనే రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా అల్ట్రాఎడ్జ్‌లో ఎక్కడా స్పైక్‌ కనిపించలేదు. ఆ తర్వాత బంతి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు చూపించింది. థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి కట్టుబడి ఔట్‌ ఇచ్చాడు.

థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో షాక్‌ తిన్న వేడ్‌..ఇదేం నిర్ణయం అంటూ భారంగా పెవిలియన్‌ చేరాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్న వేడ్‌.. చీటింగ్‌ అంటూ థర్డ్‌ అంపైర్‌పై కోపంతో రగిలిపోయాడు. హెల్మెట్‌ను నేలకేసి కొట్టిన వేడ్‌.. ఆ తర్వాత బ్యాట్‌ను కూడా కోపంతో విసిరేయడం కనిపించింది.   దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

ఇటీవలే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాచ్‌ ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం విమర్శలకు దారి తీసింది. బంతి బ్యాట్‌కు తగలడానికి ముందే స్పైక్‌ కనిపించడం..  ఆ తర్వాత బ్యాట్‌ను బంతి దాటి వెళ్లిన తర్వాత స్పైక్‌ కనిపించలేదు. అయితే థర్డ్‌ అంపైర్‌ మాత్రం రోహిత్‌ ఔట్‌ అంటూ ప్రకటించాడు. అంతకముందు కోహ్లి ఔట్‌ విషయంలోనూ థర్డ్‌ అంపైర్‌ చెత్త నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది.  

చదవండి: Asif Ali: రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్‌ క్రికెటర్‌ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం

మరిన్ని వార్తలు