మెహబూబ్‌ సిస్టర్స్‌.. అరవై దాటినా పతకాల వేట 

10 Jan, 2022 15:16 IST|Sakshi
మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పతకాలు సాధించిన మెహబూబ్‌ సిస్టర్స్‌ షకీలా, షాహీరా  

రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీల్లో  అమలాపురం మెహబూబ్‌ సిస్టర్స్‌ ప్రతిభ 

4 బంగారు, 2 వెండి పతకాల కైవసం 

అమలాపురం టౌన్‌ (తూర్పుగోదావరి): పట్టణానికి చెందిన మెహబూబ్‌ సిస్టర్స్‌ షకీలా, షాహీరా మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలకు దేశంలో ఎక్కడికి వెళ్లినా పతకాలు గెలిచి వస్తారు. ఇద్దరికీ అరవై ఏళ్ల వయస్సు దాటినా ఇరవై ఏళ్ల వయసులో ఉన్నట్లే చలాకీగా ఆటలాడేస్తారు. వయసులు మా శరీరానికే గాని మనసులకు కాదని అంటారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎస్‌పీవీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన 40వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2022 పోటీల్లో మెహబూబ్‌ సిస్టర్స్‌ షాట్‌ పుట్, లాంగ్‌ జంప్, డిస్కస్‌ త్రోలో నాలుగు బంగారు, రెండు వెండి పతకాలు సాధించారు.

చదవండి: చిట్టివలస టూ అమెరికా.. రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక

షకీలా 60 ప్లస్‌ విభాగంలో షాట్‌ పుట్, లాంగ్‌ జంప్, డిస్కస్‌ త్రోలో మొదటి స్థానాల్లో నిలిచి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. షాహీరా 70 ప్లస్‌ విభాగంలో లాంగ్‌ జంప్‌లో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని, లాంగ్‌ జంప్, డిస్కస్‌ త్రోలో ద్వితీయ స్థానాలు సాధించి రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలైన మెహబూబ్‌ సిస్టర్స్‌ను జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు బి.కృష్ణమూర్తి, ఎం.బాపిరాజు అభినందించారు. 

మరిన్ని వార్తలు