‘షూటౌట్‌’లో భారత్‌ గెలుపు

3 Apr, 2022 05:56 IST|Sakshi

భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో భారత్‌ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ‘షూటౌట్‌’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్‌లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్‌లో భారత్‌ తరఫున అభిషేక్‌ గోల్‌ చేయగా... ఇంగ్లండ్‌ తరఫున లియామ్‌ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్‌ 18 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై రెండో మ్యాచ్‌ ఉంది.

మరిన్ని వార్తలు