Rashid Khan: కెప్టెన్లుగా కీరన్‌ పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌.. ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన

2 Dec, 2022 14:40 IST|Sakshi
కీరన్‌ పొలార్డ్‌, రోహిత్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌ (PC: Mumbai Indians)

Kieron Pollard- Rashid Khan As MI Teams captains: వెస్టిండీస్‌ దిగ్గజం కీరన్‌ పొలార్డ్‌, అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌కు ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం రిలయన్స్‌ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది.

యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు కీరన్‌ పొలార్డ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్‌ ఖాన్‌ సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయా లీగ్‌లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని పేర్కొంది.

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్‌, రషీద్‌ కూడా చేరడం విశేషం.

ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై
ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కీరన్‌ పొలార్డ్‌ ఇటీవలే ఈ లీగ్‌కు ఆటగాడిగా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అతడు ముంబై బ్యాటింగ్‌ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ క్రమంలో యూఏఈ లీగ్‌లో ముంబై జట్టు కెప్టెన్‌గా పోలీని ప్రకటించడం గమనించడం గమనార్హం.

గుజరాత్‌ టైటాన్స్‌ వైస్‌ కెప్టెన్‌
ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు రషీద్‌ ఖాన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై జట్టుకు సారథిగా నియమితుడు కావడం విశేషం. 

ఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్‌ వదులుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. గుజరాత్‌ను అరంగేట్ర సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు