'వీరిద్దరు భారత క్రికెట్‌ టెంపోనూ మార్చారు'

4 Aug, 2020 12:43 IST|Sakshi

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన తర్వాత భారత క్రికెట్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి కోచ్‌గా రవి తీసుకున్న నిర్ణయాలు జట్టు టెంపోను మార్చేసాయంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత మైకెల్‌ స్లేటర్‌ పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి గురించి స్లేటర్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

'రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లిలను నేను చాలా దగ్గర్నుంచి చూశాను. ఒకరికొకరు చాలెంజింగ్‌గా కనిపించినా.. పని విషయంలో మాత్రం ఇరువురు పరస్పర నిర్ణయాలను గౌరవించుకుంటారు. కోహ్లి ఏదైనా చెబితే దానిని శాస్త్రి ఓపికగా వింటాడు.. కోహ్లి విషయంలోనూ ఇదే జరగుతుంది. ఇద్దరి నిర్ణయాల్లో కొన్నిసార్లు తప్పులు కనిపించినా.. సర్దుకుపోవడం గమనించాను. అంతేకాదు కామెంటరీ బాక్స్‌లో నేను  శాస్త్రిని చాలా దగ్గర్నుంచి చూశాను. నేను పని చేసిన అత్యుత్తమ కామెంటరీల్లో రవిశాస్త్రి ఒకడు. ఇద్దరిలో చాలా తేడాలున్నా.. అవన్నీ పక్కనపెట్టి కలిసి పనిచేయడం ద్వారా భారత క్రికెట్‌ టెంపోను మార్చివేశారు.'అంటూ స్లేటర్‌ పేర్కొన్నాడు.

కాగా 2017లో అనిల్‌ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో రవిశాస్త్రి వచ్చాడు. కుంబ్లే సలహాలు తనకు నచ్చేవి కావని కోహ్లి బాహటంగానే ప్రకటించడం.. ఇద్దరి మధ్య మనస్పర్థలు దారి తీసింది. అప్పటినుంచి భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న శాస్త్రి పదవిని ఈ మధ్యనే మరో రెండేళ్లకు పొడిగించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకు శాస్త్రి ప్రధాన కోచ్‌ పదవిలో కొనసాగనున్నారు. (ధోని వాస్తవమేంటో చూపించాడు : యూవీ)

మరిన్ని వార్తలు