టీమిండియా బౌలర్‌పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ప్రశంసలు

29 Mar, 2021 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మూడో వన్డేలో భారత్‌ ఇంగ్లండ్‌పై గ్రాండ్‌ విక్టరీ సాధించి, 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా సాధించిన ఈ విజయానికి రిషబ్‌ పంత్‌ అద్భుత బ్యాటింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (4/67) బౌలింగ్‌ గణాంకాలే కారణమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసి, భారత్‌ శిబిరంలో ఆందోళన రేపిన ఇంగ్లండ్‌ నవయువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ను సైతం అందరూ కొనియాడుతున్నారు. అయితే, చివరి ఓవర్‌ అద్భుతంగా బౌల్‌ చేసిన టీమిండియా పేసర్‌ నటరాజన్‌ను మాత్రం ఎవ్వరూ గుర్తించడంలేదని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

6 బంతుల్లో 14 పరుగులు సాధించాల్సిన తరుణంలో అద్భుతమైన యార్కర్లను సంధించిన నట్టూపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిలోనూ నటరాజన్‌ తన యార్కర్లతో మాయ చేశాడని, ఆఖరి ఓవర్‌ బౌల్‌ చేసే  సమయంలో అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో ఊహించడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లలో తక్కువ ఎత్తులో యార్కర్లు సంధించడం​ అద్భుతమైన కళ అని, అది నట్టూకు బాగానే ఉందని కొనియాడాడు. సరైన బంతులు విసిరి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువేనని వెల్లడించాడు. స్లాగ్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా బంతిని స్టాండ్స్‌లో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించాడు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన యార్కర్లు సంధించగల ఆటగాళ్లలో లసిత్‌ మలింగ, బ్రెట్‌లీలు ముందువరుసలో ఉంటారని పేర్కొన్నాడు.
చదవండి: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్

మరిన్ని వార్తలు