అతనొక గొప్ప డ్రింక్‌ మిక్సర్‌ అయ్యిండొచ్చు .. అందుకే అలా

22 Mar, 2021 16:31 IST|Sakshi

లండన్‌: టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-3 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లండ్‌ జట్టుపై ముప్పేట దాడి మొదలైంది. జట్టు యాజమాన్యం అవలంభిస్తున్న రోటేషన్‌ పద్దతి కారణంగానే ఇంగ్లీష్‌ జట్టు సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చిందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. టీ20 స్పెషలిస్ట్‌ అయిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం కల్పించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ మండిపడ్డాడు. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మొయిన్‌ అలీ ఆడిన ఏకైక టెస్టులో(రెండో టెస్టు) ఆశాజనకమైన ప్రదర్శన(8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో18 బంతుల్లో 43 పరుగులు) కనబర్చినప్పటికీ.. రోటేషన్‌ పద్దతి కారణంగా అతన్ని  ఆఖరి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరం పెట్టడంపై వాన్‌ ధ్వజమెత్తాడు. 

తిరిగి టీ20 సిరీస్‌ కోసం అతను జట్టులో చేరినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా, కేవలం బెంచ్‌కే పరిమితం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొయిన్‌ను ఇంగ్లండ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌.. డ్రింక్స్‌ సప్లయర్‌గా, ఎనర్జీ డ్రింక్స్‌ మిక్సర్‌ ఉపయోగించుకుందని ఆయన ధ్వజమెత్తాడు. మొయిన్‌ ఓ గొప్ప డ్రింక్‌ మిక్సర్‌ అయ్యిండొచ్చు .. అందుకే యాజమాన్యం అతనినలా ఉపయోగించుకొని ఉండవచ్చని వ్యంగ్యంగా స్పందించాడు. రోటేషన్‌ పద్దతి పేరుతో యాజమాన్యం ఆటగాళ్లతో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. కాగా, సిరీస్‌ మొత్తంలో టీమిండియా ఇ‍ద్దరు స్పిన్నర్లకు అవకాశం కల్పిస్తే, ఇంగ్లండ్‌ మాత్రం కేవలం ఆదిల్‌ రషీద్‌కే పదేపదే అవకాశం కల్సిస్తూ, మొయిన్‌అలీని విస్మరించిడంపై ఆయన మండిపడ్డాడు. 

మరిన్ని వార్తలు