మిషెల్‌ మార్ష్ అవుట్‌!

23 Sep, 2020 02:43 IST|Sakshi

గాయంతో లీగ్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశం 

దుబాయ్‌: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ జట్టులో కీలక ఆటగాడిని కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్ మొత్తం లీగ్‌కు దూరం కావచ్చని సమాచారం. సన్‌రైజర్స్‌ దీనిని అధికారికంగా ప్రకటించకపోయినా... అతని చీలమండ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసింది. తన బౌలింగ్‌లో రెండో బంతికి ఫించ్‌ షాట్‌ను ఆపబోయి గాయపడిన మార్ష్ మరో రెండు బంతులు మాత్రమే వేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే అవుటయ్యాడు. అతను ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, మరో మ్యాచ్‌ కూడా ఆడటం కష్టమేనని రైజర్స్‌ వర్గాలు వెల్లడించాయి. అతని స్థానంలో మరో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ డానియెల్‌ క్రిస్టియాన్‌ పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు కేన్‌ విలియమ్సన్‌ కూడా తొడ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. విలియమ్సన్‌ ఎప్పటివరకు కోలుకుంటాడనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు.   

మరిన్ని వార్తలు