ఆరోజు బస్సులో అతని పక్కనే కూర్చున్నా.. అందుకే

19 May, 2021 16:28 IST|Sakshi

సిడ్నీ: కరోనా మహమ్మరి సెగతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అమిత్‌ మిశ్రాలు కరోనా బారీన పడ్డారు. ఇటు సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి కూడా కరోనా సోకడంతో  లీగ్‌ను రద్దు చేయక తప్పలేదు.  అలా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కరోనా బారిన పడ్డ వారిలో సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ కూడా ఉన్నాడు. హస్సీకి రెండు సార్లు కరోనా పాజిటివ్‌ రావడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండి కోలుకున్న అతను ఇటీవలే మాల్దీవ్స్‌ నుంచి తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.

తాజాగా హస్సీ తన ఆరోగ్య పరిస్థితిపై ఫాక్స్‌ స్పోర్ట్స్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ' కరోనా నుంచి కోలుకున్న ఇంకా శరీరం కాస్త వీక్‌గానే ఉంది. మళ్లీ నార్మల్‌ కండీషన్‌కు రావడానికి నాకు కొంచెం టైమ్‌ పట్టొచ్చు. కరోనా సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్‌ రావడంతో కాస్తంత భయపడ్డా.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. బహుశా నాకు బాలాజీ ద్వారానే కరోనా వచ్చి ఉండొచ్చు. ఆరోజు బస్సులో తాను బాలాజీ పక్కనే కూర్చున్నా.. అప్పటికే బాలాజీకి కరోనా లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు. బాలాజీతో కబుర్లు చెబుతూ కాస్త సరదాగా గడిపాను... బహుశా అప్పుడు ట్రాన్స్‌మిషన్‌ ద్వారా కరోనా సోకి ఉండొచ్చు. ఏదైతేనేం కరోనాను జయించి నా దేశానికి చేరుకున్నా. నేను సిడ్నీ ఎయిర్‌పోర్టులో దిగగానే నా కుటుంబసభ్యులు, పోలీసులు, మెడికల్‌ సిబ్బంది నన్ను రిసీవ్‌ చేసుకున్న విధానం బాగా నచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు. 

2004 నుంచి 2013 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మైక్‌ హస్సీ 79 టెస్టుల్లో 6,235 పరుగులు; 185 వన్డేల్లో 5,442 పరుగులు; 38 టీ20ల్లో 721 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన హస్సీ 59 మ్యాచ్‌లాడి 1977 పరుగులు చేశాడు.
చదవండి: మైకెల్‌ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌

AUS VS ENG: యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

మరిన్ని వార్తలు