కరోనాతో మిల్కా సింగ్‌ భార్య మృతి

14 Jun, 2021 08:58 IST|Sakshi
భార్య నిర్మల్‌ కౌర్‌తో మిల్కా సింగ్‌(ఫైల్‌ ఫొటో)

చండీగఢ్‌: భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మిల్కాసింగ్‌ భార్య నిర్మల్‌ కౌర్‌ కరోనా వైరస్‌తో పోరాడుతూ ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు ఆమె కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. 85 ఏళ్ల నిర్మల్‌ పంజాబ్‌ ప్రభుత్వంలో మహిళా స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పని చేశారు. భారత మహిళల వాలీబాల్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. కాగా 91 ఏళ్ల మిల్కా సింగ్‌ సైతం ఇటీవల కోవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

అనంతరం చండీగఢ్‌లోని మిల్కా సింగ్‌ నివాసానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇక మిల్కా సింగ్‌ 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారన్న విషయం తెలిసిందే. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా క్రీడాకారులైన మిల్కా సింగ్‌- నిర్మల్‌ కౌర్‌ 1963లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు సంతానం.

చదవండి: మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..?

మరిన్ని వార్తలు