AUS vs IND: మిచెల్ మార్ష్‌ విధ్వంసం.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో! ఢిల్లీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

19 Mar, 2023 18:21 IST|Sakshi

విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన.. ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(66 పరుగులు), ట్రావిస్‌ హెడ్‌( 51 పరుగులు) దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.

మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం...
ఈ మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే 66  పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే భారత బౌలర్లకు మార్ష్‌ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు మార్ష్‌ చెమటలు పట్టించాడు. హార్దిక్‌ వేసిన 8వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది.. 18 పరుగులు రాబట్టాడు.

గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్‌ షమీ, సిరాజ్‌ను కూడా మార్ష్‌ వదలలేదు. సిరాజ్‌  3 ఓవర్లలో ఏకంగా 37 పరుగులివ్వగా.. షమీ  3 ఓవర్లలో 29 పరుగులిచ్చాడు. మార్ష్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కేవలం 28 బంతుల్లోనే అందుకున్నాడు. కాగా ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా మార్ష్‌(81) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 5వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఢిల్లీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ..
ఇక మిచెల్‌ మార్ష్‌ ఊచకోత చూసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌ సంబురాల్లో మునిగి తేలిపోతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు మార్ష్‌ ఈ తరహా ఇన్నింగ్స్‌లు ఆడుతుండటం.. ఢిల్లీ మెనెజెమెంట్‌తో పాటు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కూడా మార్ష్‌ ఇదే తరహా విధ్వంసాన్ని కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా ఐపీఎల్‌లో మిచెల్‌ మార్ష్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను మార్ష్‌ ప్రారంభించే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: గోల్డన్‌ డక్‌లు.. సూర్యను పక్కన పెట్టండి!అతడిని జట్టులోకి తీసుకురండి

మరిన్ని వార్తలు