ICC Rankings: టాప్‌ లేపిన మిథాలీ.. మూడేళ్ల తర్వాత అగ్రపీఠం కైవసం

6 Jul, 2021 19:15 IST|Sakshi

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్ము లేపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిథాలీ.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వత మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో టీమిండియా స్టార్​ బ్యాటర్​ స్మృతి మంధాన.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

బౌలింగ్ విభాగంలో జూలన్​ గోస్వామి(694 పాయింట్లు) 4వ స్థానంలో, పూనమ్​ యూదవ్​(617 పాయింట్లు) 9వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్లు జెస్​ జొనాస్సెన్​ (808 పాయింట్లు), మేఘన్​ షట్​(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆల్​రౌండర్ల విభాగంలో టీమిండియా మహిళా క్రికెటర్​ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్​ (సౌతాఫ్రికా), ఎలిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

ఇక, ​టీ20 ర్యాంకింగ్స్​ విషయానికొస్తే.. బ్యాటింగ్‌ విభాగంలో​ ఇద్దరు భారత మహిళా బ్యాటర్లు టాప్​ -10లో నిలిచారు. టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ 776 రేటింగ్‌ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా, మరో స్టార్‌ బ్యాటర​ స్మృతి మంధాన(693 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఫార్మాట్‌లోని బౌలింగ్​ విభాగంలో భారత బౌలర్లు దీప్తి శర్మ 5వ ర్యాంక్‌లో, రాధా యాదవ్​ 6వ స్థానంలో ఉన్నారు. ఆల్​రౌండర్​ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. 

మరిన్ని వార్తలు