చరిత్ర సృష్టించిన మిథాలీ.. 10వేల పరుగుల క్లబ్‌లో

12 Mar, 2021 13:12 IST|Sakshi

లక్నో: టీమిండియా ఉమెన్స్‌ వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఈ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు అందుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌లో అన్నే బోస్క్‌ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్‌ను చేరుకుంది.

మొత్తంగా చూసుకుంటే మిథాలీ రాజ్‌ ఇప్పటివరకు 10 టెస్టుల్లో 663 పరుగులు, 210 వన్డేల్లో 6938 పరుగులు, 89 టీ20ల్లో 2364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 7 సెంచరీలు చేయగా.. టెస్టుల్లో 1 సెంచరీ సాధించింది. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌​ తరపున ఎడ్‌వర్డ్స్‌ 23 టెస్టుల్లో 1676 పరుగులు, 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టీ20ల్లో 2605 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఉమెన్స్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ 77 పరుగులతో రాణించగా.. మిథాలీ, హర్మన్‌ ప్రీత్‌, దీప్తి శర్మ 36 పరుగులతో రాణించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 4 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 8 పరుగులు చేసింది. 
చదవండి:
త్రో వేయడంలో కన్ఫ్యూజన్‌‌.. అసలు మజా అక్కడే

పంత్‌ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్

మరిన్ని వార్తలు