Moeen Ali: 'భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ నాకు ఆఖరిది'

14 Mar, 2023 22:30 IST|Sakshi

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ రిటైర్మెంట్‌ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైన ఇంగ్లండ్‌ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి ఇంగ్లండ్‌ అభిమానులను బాధిస్తే.. బంగ్లా అభిమానులను మాత్రం ఫుల్‌ ఖుషీ చేసింది. కారణం.. టి20 క్రికెట్‌లో వరల్డ్‌ ఛాంపియన్స్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించడమే.

ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌ అనంతరం మొయిన్‌ అలీ తన రిటైర్మెంట్‌పై చిన్న హింట్‌ ఇచ్చాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మొయిన్‌ అలీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే..

''నేను రిటైర్‌ కానని చెప్పను.. అలాగని రిటైర్‌ అవ్వకుండా ఉండను. మరో ఏడు, ఎనిమిది నెలల్లో 35వ పడిలో అడుగుపెట్టబోతున్నా. రిటైర్మెంట్‌ వయసు వచ్చేసిందనిపిస్తుంది. ఇక ఎలాంటి గోల్స్‌ పెట్టుకోదలచుకోలేదు. అయితే ఈ ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలనుకుంటున్నా. ఆ వరల్డ్‌కప్‌ గెలవాలని కోరుకుంటున్నా. బహుశా అదే నా చివరి వన్డే కావొచ్చు.'' అని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ కేవలం వన్డేలకు మాత్రమే గుడ్‌బై చెప్పనున్నాడు. టి20ల్లో మాత్రం కొంతకాలం కొనసాగనున్నాడు. ఇక మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మొయిన్‌ అలీ ఇంగ్లండ్‌ తరపున 64 టెస్టుల్లో 2914 పరుగులతో పాటు 195 వికెట్లు, 123 వన్డేల్లో 2051 పరుగులతో పాటు 95 వికెట్లు, 71 టి20ల్లో 1044 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: WTC Final: ఏ లెక్కన ఆసీస్‌ను ఓడించదో చెప్పండి?

ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లా

మరిన్ని వార్తలు