వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్‌

17 Jun, 2021 11:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసొసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను నాటకీయ పరిణామాల మధ్య తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ నోటీసులపై అజారుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. 'ఉద్దేశపూర్వకంగానే నాకు నోటీసులు ఇచ్చారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా నేనెప్పుడూ పనిచేయలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వాళ్ల నిర్ణయమే అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయంగా చెబితే ఎలా?. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్‌మన్‌ను నియమిస్తే అడ్డుకున్నారు... వాళ్ల అవినీతి బయటపడుతుందనే నాపై కుట్రలు పన్నారు' అంటూ చెప్పుకొచ్చారు.

కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్‌పైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్‌ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది.
చదవండి: అజహరుద్దీన్‌పై వేటు!

మరిన్ని వార్తలు