Mohammad kaif: టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్‌

8 Sep, 2021 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓవల్‌ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం​ సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్‌ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. 

ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సైతం తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. నాగిని డ్యాన్స్‌ వేస్తూ టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. "టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు.. నచ్చిన విధంగా సెలబ్రేట్‌ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్‌.. ఇలా నాగిని డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కైఫ్‌.. టీమిండియా విజయాన్ని వంద శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండయా157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ కాగా, 290 వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ సూపర్‌ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్‌ మ్యాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.
చదవండి: ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్‌ లేదన్నారు: శార్దూల్‌ ఠాకూర్‌

మరిన్ని వార్తలు