Mohammed Siraj : 39 ఏళ్ల రికార్డు బద్దలు.. కపిల్‌ తర్వాత సిరాజ్‌ మాత్రమే

17 Aug, 2021 17:08 IST|Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్‌ లార్డ్స్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఎనిమిది వికెట్లలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇక లార్డ్స్‌ టెస్టులో ఒక టీమిండియా బౌలర్‌ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే.

ఇంతకముందు 1982లో కపిల్‌ దేవ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో కపిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఓవరాల్‌గా 8 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం విశేషం. ఇక 2014లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 364 పరుగులకి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) టాప్ స్కోరర్‌కాగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (5/62) ఐదు వికెట్ల మార్క్‌ని అందుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ జో రూట్ (180: 321 బంతుల్లో 18x4) రికార్డు శతకం నమోదు చేయగా.. మహ్మద్ సిరాజ్ (4/94), ఇషాంత్ శర్మ (3/69) ఆకట్టుకున్నారు. 27 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టులో అజింక్య రహానె (61: 146 బంతుల్లో 5x4), మహ్మద్ షమీ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌‌ని 298/8తో భారత్ డిక్లేర్ చేయగా.. 272 పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందు నిలిచింది. ఛేదనలో సిరాజ్‌ 4, బుమ్రా 3 దెబ్బకు ఇంగ్లాండ్ 120 పరుగులకే చాప చుట్టేసి 151 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 

మరిన్ని వార్తలు