టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్‌

26 Jun, 2021 16:12 IST|Sakshi

టీమిండియా సారథిని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ట్వీ20లకు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మను కెప్టెన్‌ చేయాలని ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్లూటీసీ) ఫైనల్‌లో కొహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఓడిపోయిన తరువాత పనేసర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భారత జట్టులో కెప్టెన్సీ మార్పుపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది.  

రోహిత్‌ ముందుండి నడిపించగలడు
చాలా దేశాలు వివిధ ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లను ఎంపిక చేసుకుని వాళ్ల జట్లను నడిపిస్తుండగా,భారత్‌,పాకిస్తాన్,న్యూజిలాండ్ దేశాలు మాత్రం అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌తో బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం విరాట్‌ ఒత్తిడిలో ఉన్నాడని రాబోవు 2021 ట్వీ20 ప్రపంచ కప్‌ దృష్ట్యా హిట్‌మ్యాన్‌కు టీమిండియా సారథ్యం బాధ్యతలు అప్పగించాలని పనేసర్‌ సూచించాడు. 

అంతేగాక రోహిత్‌కు ఐపీఎల్‌ లో ముంబై జట్టుకి సారథ్యం వహించి ఎన్నో విజయాలను అందించడమే గాక ఐపీఎల్‌లో ముంబైని ఫైనల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిపిన ఘనత కూడా ఉందని గుర్తు చేశాడు. పొట్టి ఫార్మట్‌లో తన టీంను సమర్థవంతంగా నడిపించగల అనుభవం తనకుందని అతను ఎప్పుడో నిరూపించుకున్నాడని పనేసర్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఆసియా కప్‌తో పాటు నిదాహాస్ ట్రోఫీలో కూడా భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇప్పటివరకు, అతను భారత్‌కు 29 సార్లు (10 వన్డేలు, 19 టీ20 ) నాయకత్వం వహించగా, అందులో 23 (8 వన్డేలు, 15 టీ 20 ) విజయాలు ఉన్నాయి.

చదవండి: WTC: కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్‌ కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు