మోర్నీ మోర్కెల్‌ వేగవంతమైన బంతి.. దిల్షాన్‌ భయపడ్డాడు

30 Jan, 2022 15:47 IST|Sakshi

తొలిసారి నిర్వహించిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2022 టోర్నీ విజేతగా వరల్డ్‌ జెయింట్స్‌ నిలిచింది. ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్‌ జెయింట్స్‌ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆసియా లయన్స్‌ గట్టిపోటీ ఇచ్చినప్పటికి పరాజయం పాలైంది. ఆట సంగతి ఎలా ఉన్నా.. మాజీ క్రికెటర్లంతా ఒక దగ్గరికి చేరి టోర్నీ ఆడడం అభిమానులకు మాత్రం సంతోషాన్ని పంచింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌ బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు.

37 ఏళ్ల మోర్కెల్‌ మంచి ఫాస్ట్‌ బౌలర్‌ అన్న సంగతి తెలిసిందే. ప్రొటీస్‌కు క్రికెట్‌ ఆడిన రోజుల్లో ఎన్నోసార్లు వేగవంతమైన బంతులు విసిరాడు. తాజాగా ఫైనల్‌ మ్యాచ్‌లో తిలకరత్నే దిల్షాన్‌కు వేసిన ఒక బంతి గంటకు 138 కిమీవేగంతో వెళ్లింది. మంచి పేస్‌తో.. బౌన్స్‌తో వచ్చిన బంతిని దిల్షాన్‌ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే బంతి విసిరిన తర్వాత పట్టుతప్పిన మోర్కెల్‌ క్రీజులోనే కిందపడ్డాడు. అతను పడ్డ విధానం చూసి గాయమైందనే అనుకున్నారు. కానీ అదృష్టం బాగుండడంతో మోర్కెల్‌కు ఎలాంటి గాయం కాలేదు. ఇదే మ్యాచ్‌లో తన సోదరుడు అల్బీ మోర్కెల్‌ మూడు వికెట్లతో రాణించాడు. కాగా మోర్నీ మోర్కెల్‌ దిల్షాన్‌ను తన తర్వాతి ఓవర్లో స్లో డెలివరీ వేసి బోల్తా కొట్టించాడు. 

మరిన్ని వార్తలు