‘ఐపీఎల్‌ వేలంలో అతని కోసం పోటీ తప్పదు’

3 Dec, 2020 14:03 IST|Sakshi

లండన్‌: వచ్చే ఏడాది ఐపీఎల్‌ను‌ మరో నాలుగ-ఐదు నెలల్లో నిర్వహించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్‌-14వ సీజన్‌కు 10 జట్లు బరిలో దింపాలను బీసీసీఐ యత్నిస్తున్నప్పటికీ సాధ్యాసాధ్యాలపై ఏజీఎం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీన బీసీసీఐ ఏజీఎం సమావేశం జరుగనున్న తరుణంలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అందులో వచ్చే ఏడాది ఐపీఎల్‌కు మరో రెండు జట్లను తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఒకవేళ మరో రెండు జట్లను కలిపితే మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది.  మరి దీనిపైనే సదరు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇదిలా ఉంచితే,  వచ్చే సీజన్‌ ఐపీఎల్‌లో భాగంగా జరిగే వేలంలో మ్యాక్స్‌వెల్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచ వైట్‌బాల్‌ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ మంచి క్రికెటర్‌. ఏ జట్టైనా మ్యాక్సీలాంటి ఆటగాడ్ని వద్దనుకోదు. నేను కచ్చితంగా చెబుతున్నా.. ఈసారి ఐపీఎల్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ కోసం చాలా జట్లు పోటీ పడతాయి. ఆస్ట్రేలియా జట్టు  తరఫున మ్యాక్సీ  కీలక పాత్ర పోషిస్తున్నా. అతని ఏ స్థానంలో ఆడగలడో దాన్ని ఆసీస్‌ గుర్తించింది. మ్యాక్స్‌వెల్‌ మంచి ఫీల్డర్‌ కూడా. కొన్ని కీలకమైన పరుగుల్ని కూడా మ్యాక్సీ సేవ్‌ చేస్తాడు. దాంతో మ్యాక్సీపై ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది’ అని వాన్‌ పేర్కొన్నాడు. 

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన మ్యాక్సీ దారుణంగా విఫలమయ్యాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులే చేశాడు. ఒక్క సిక్స్‌ కూడా లేకుండా ఐపీఎల్‌ను ముగించాడు.  దాంతో మ్యాక్సీని వదిలించుకునేందుకు కింగ్స్‌ పంజాబ్‌ సిద్ధమైంది.  కాగా, ఆ తర్వాత టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాక్స్‌వెల్‌ చెలరేగి ఆడున్నాడు. వన్డే సిరీస్‌లో 167 పరుగులు చేసి ఆసీస్‌ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 83కు పైగా సగటు, 194పైగా స్టైక్‌రేట్‌తో దుమ్ములేపాడు. ఇందులో 12 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. ఫలితంగా వన్డే సిరీస్‌లో అత్యధిక ‘బౌండరీలు’ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 

>
మరిన్ని వార్తలు