FIFA WC 2022: మెస్సీపై అభిమానం దేశాలను దాటించింది

26 Nov, 2022 19:05 IST|Sakshi

అభిమానానికి ఒక రేంజ్‌ ఉంటుంది. అది క్రికెట్‌ లేదా ఫుట్‌బాల్‌ కావొచ్చు. తనకు ఇష్టమైన ఆటగాడు బరిలోకి దిగాడంటే అతని ఆటను ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది అభిమానులు అనుకుంటారు. అందుకోసం ఎంత రిస్క్‌ అయినా భరిస్తారు. తాజాగా మెస్సీపై ఉన్న వీరాభిమానం ఒక భారతీయ మహిళను ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ దాకా తీసుకొచ్చింది. ఆమె ఒక్కతే రాలేదు.. కూడా తన ఐదుగురు పిల్లలను వెంటబెట్టుకొని మహీంద్రా ఎస్‌యూవీ కారులో ఖతర్‌కు చేరుకుంది.

విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన 35 ఏళ్ల నాజీ నౌషీకి మెస్సీకి వీరాభిమాని. మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్‌ అని అందరూ ఊహించుకుంటున్న వేళ నాజీ ఎలాగైనా మెస్సీ ఆటను దగ్గరి నుంచి చూడాలనుకుంది. అయితే ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. దీంతో తన పిల్లలను వెంటబెట్టుకొని ఎస్‌యూవీ కారులో తన ప్రయాణం ప్రారంభించింది.

ముంబై చేరుకొని అక్కడి నుంచి విమానంలో యూఏఈకి చేరుకుంది. తన ఎస్‌యూవీ కారును యూఏఈకి షిప్పింగ్‌ చేసింది. అలా అక్టోబర్‌ 15న కేరళ నుంచి బయలుదేరిన నౌషీ మొత్తానికి ఖతర్‌కు చేరుకుంది. అయితే మధ్యలో దుబాయ్‌లోని ప్రఖ్యాత బూర్జ్‌ ఖలీఫా చూడడానికి ఎస్‌యూవీ కారులో వెళ్లిన నౌషీకి ఖలీజ్‌ టైమ్స్‌ విలేకరి ఒకరు ఎదురుపడ్డాడు. ఐదుగురు పిల్లలతో కలిసి ఒంటరిగా ప్రయాణం చేయడం గమనించిన సదరు విలేకరి నౌషీ గురించి ఆరా తీశాడు. ఆ ప్రయత్నంలోనే నౌషీ మెస్సీపై ఉన్న అభిమానమే నన్ను ఖతర్‌ దాకా తీసుకొచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టుకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఊహించని షాక్‌ ఇచ్చింది. 2-1 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది. ఈ ఓటమిపై స్పందించిన నౌషీ.. ఈసారి కచ్చితంగా కప్‌ అర్జెంటీనాదే.. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాం. కానీ మెక్సికోతో మ్యాచ్‌లో మెస్సీ సేనదే విజయం. కేవలం మెస్సీ ఆట కోసమే పిల్లలతో కలిసి ఇంతదూరం వచ్చా. తినడానికి సరిపడా సరుకులు బండిలో ఉన్నాయి. ఖతర్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలనేది నా ఆలోచన. వీలైనంత వరకు మా వెంట తెచ్చుకున్న ఆహారాన్ని వండుకొని తినడానికి ప్రయత్నిస్తాం అంటూ ముగించింది. 

ఇది చూసిన కొందరు ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌.. నీ ఓపికకు సలాం తల్లి.. ఒక ఆటగాడిపై అభిమానంతో అతని ఆటను చూసేందుకు దేశాలను దాటి వెళ్లడం నిజంగా గొప్ప విషయం. నీకోసమైనా మెస్సీ సేన టైటిల్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్నాము అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని వార్తలు