IPL 2023: సీఎస్‌కే కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం

4 Sep, 2022 15:19 IST|Sakshi

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో జట్టు కెప్టెన్‌ ఎవరనే విషయమై ఫ్రాంచైజీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. వచ్చే సీజన్‌లో కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనినే కొనసాగుతాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌ ఆదివారం మరోసారి స్పష్టం చేశాడు. సీఎస్‌కేను నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని సారధ్యంలోనే సీఎస్‌కే మరోసారి బరిలో నిలువనుందని కాశీ విశ్వనాథ్‌ వెల్లడించాడు. 

కాగా, 2022 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు సీఎస్‌కే తొలిసారి కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ధోని ఇష్టపూర్వకంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. అయితే జడ్డూ కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్‌ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే జట్టు భారం మోయవలసిందిగా కోరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని మరోసారి సీఎస్‌కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే గత సీజన్‌లో సీఎస్‌కేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి మ్యాచ్‌ల్లో ధోని కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. సీఎస్‌కే తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే, కెప్టెన్‌గా సీఎస్‌కే యాజమాన్యం ధోనినే ప్రకటించినప్పటికీ.. వయసు పైబడిన రిత్యా అతను లీగ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. గత రెండు సీజన్లుగా ఈ విషయమై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. ధోనికి ఇష్టం లేకపోయిన బలవంతంగా అతనిపై కెప్టెన్సీ భారాన్ని మోపుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ధోని ఐదోసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌పుల్‌ కెప్టెన్‌గా కెరీర్‌ ముగించాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయమై ధోని క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. 
చదవండి: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్‌కు అనారోగ్యం

మరిన్ని వార్తలు