ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మరో రెండేళ్లు సీఎస్కేతోనే

8 Jul, 2021 15:04 IST|Sakshi

చెన్నై: నిన్న(జులై 7) తమ ఆరాధ్య క్రికెటర్‌ 40వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న ధోనీ అభిమానులకు.. రోజు  తిరక్కుండానే మరో తీపికబురు అందింది. మహేంద్రుడు మరో రెండేళ్లపాటు సీఎస్కేలో కొనసాగుతాడని చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వ‌నాథ‌న్ వెల్ల‌డించడంతో ధోనీ అభిమానులు సహా సీఎస్కే ఫ్యాన్స్‌ ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. త‌మ అభిమాన క్రికెట‌ర్‌ను ఇండియ‌న్ క‌ల‌ర్స్‌లో చూడ‌లేక‌పోయినా.. క‌నీసం మ‌రో రెండేళ్లు ఫీల్డ్‌లో చూసే అవ‌కాశం ద‌క్క‌నుందని ఉబ్బితబ్బి అవుతున్నారు. ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. ధోనీకి మరో రెండేళ్ల పాటు క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఉందని, ప్రస్తుతం అత‌ను పూర్తి ఫిట్‌గా ఉన్నాడని పేర్కొన్నాడు. 

ధోనీ క్రికెట్‌లో కొన‌సాగ‌క‌పోవ‌డానికి ఎలాంటి కార‌ణం లేదని, అతను ఫిట్‌గా ఉన్నంతకాలం సీఎస్కేతో ట్రావెల్‌ చేస్తాడని ఆయన స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ధోనీ అందించిన సేవల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, సీఎస్కేకు అతని అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లేయ‌ర్‌గా పెద్ద‌గా రాణించ‌లేకపోయిన మహేంద్రుడు.. కెప్టెన్‌గా జట్టును ముందుండి న‌డిపించాడు. క‌రోనా కార‌ణంగా టోర్నీ అర్ధంత‌రంగా ముగిసే స‌మ‌యానికి పాయింట్ల పట్టికలో చెన్నైను రెండో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ధోనీ ఫామ్‌ లేమితో సతమతమవుతున్నప్పటికీ .. చెన్నై జట్టు మాత్రం ఇప్ప‌టికీ అత‌ని సామ‌ర్థ్యంపై నమ్మకం ఉంచి అతనికి అవకాశాలు కల్పిస్తూనే ఉంది.

మరిన్ని వార్తలు