ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించిన ధోని.. తొలి సినిమా ఏ భాషలో తెలుసా..?

25 Oct, 2022 18:34 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఎట్టకేలకు సినీ నిర్మాణ రంగంలోని అడుగుపెట్టాడు. దీపావళి పర్వదినాన భార్య సాక్షి సింగ్‌ ధోనితో కలిసి 'ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌' పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు సాక్షి సింగ్ ధోని మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తొలుత తమిళ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధులు తెలిపారు.

తమ సంస్థ నిర్మించబోయే తొలి చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతరత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సాక్షి సింగ్‌ ధోనినే కథ సమకూర్చినట్లు తెలుస్తోంది.

కాగా. ధోని.. తమిళ సూపర్‌ స్టార్‌, ఇళయదళపతి విజయ్‌తో కలిసి త్వరలోనే సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ  విషయంపై కూడా ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రతినిధుల స్పందించారు. ధోనికి తమిళనాట విపరీతమైన క్రేజ్‌ ఉండటంతో ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వరుస తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు  పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
చదవండి: ధోని ప్రొడక్షన్‌లో హీరోగా విజయ్‌? స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు

మరిన్ని వార్తలు