ఎంఎస్‌ ధోని నయా చరిత్ర.. రైనా కంగ్రాట్స్‌

19 Oct, 2020 22:03 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నయా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండొందల మ్యాచ్‌ ఆడిన రికార్డును ధోని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్‌ సాధించాడు. ఫలితంగా రెండొంద మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు అత్యధిక మ్యాచ్‌ల రికార్డు సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా పేరిట ఉంది. అయితే ఈ సీజన్‌ నుంచి రైనా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో రైనా వైదొలగడంతో రెండొందల మ్యాచ్‌ల ఆడిన తొలి ప్లేయర్‌ రికార్డును కోల్పోయాడు. ఐపీఎల్‌లో రైనా 193 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ధోని తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నాడు. రోహిత్‌ శర్మ 197 మ్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, కేకేఆర్‌ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ 191 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.(ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది)

ఇదిలా ఉంచితే ఐపీఎల్‌లో  ధోని 4,596  పరుగులతో ఉన్నాడు. కాగా, ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. ధోని ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 215 సిక్స్‌లు కొట్టగా, గేల్‌(333) తొలి స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్‌ 231 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ధోనికి రైనా కంగ్రాట్స్‌..
ఐపీఎల్‌లో 200వ మ్యాచ్‌ ఆడిన ఫీట్‌ను సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచిన ధోనికి సురేశ్‌ రైనా అభినందనలు తెలియజేశాడు. తన ట్వీటర్‌ అకౌంట్‌లో ధోనికి కంగ్రాట్స్‌ తెలిపాడు. ‘ 200వ మ్యాచ్‌ ఘనతను సాధించిన తొలి ప్లేయర్‌కు ఇవే నా అభినందనలు. ధోని భాయ్‌.. బెస్టాఫ్‌ లక్‌ టుడే. మరిన్ని ఘనతలు నువ్వు సాధించాలి. మాకు నువ్వుప్పుడూ గర్వకారణమే’ అని ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు