-

ధోని కెప్టెన్సీ మ్యాజిక్‌

14 Oct, 2020 10:30 IST|Sakshi

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత సీఎస్‌కే గెలుపొంది శభాష్‌ అనిపించింది. 167 పరుగుల సాధారణ స్కోరును కాపాడుకుని సీఎస్‌కే జయకేతనం ఎగురువేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ మ్యాజిక్‌ కనిపించింది. విజయ్‌ శంకర్‌ కోసం ఫీల్డింగ్‌ సెట్‌ చేసి  వికెట్‌ను  రాబట్టాడు ధోని. డ్వేన్‌ బ్రేవో వేసిన 17 ఓవర్‌ తొలి బంతికి శంకర్‌ సిక్స్‌ కొట్టాడు. ఆ మరుసటి బంతికి సింగిల్‌ తీసిన శంకర్‌కు మళ్లీ నాల్గో బంతికి స్ట్రైకింగ్‌కు వచ్చాడు. కాగా, విజయ్‌ శంకర్‌ కోసం​ ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు ధోని. బ్రేవో వద్దకు వెళ్లి అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌కు బంతి వేయమని చెప్పి దానికి తగ్గట్టు బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు. అక్కడ బెస్ట్‌ ఫీల్డర్‌ జడేజాను ఉంచాడు. కచ్చితంగా భారీ షాట్‌ ఆడతాడని భావించిన ధోని వ్యూహం ఫలించింది. బాగా ఎడంగా ఆఫ్ట్‌ స్టంప్‌ బయటకు బ్రేవో వేసిన బంతిని అనుకున్నట్లే విజయ్‌ శంకర్‌ హిట్‌ చేశాడు. 

అంతే అది గాల్లోకి లేవడం జడేజా దాన్ని క్యాచ్‌ అందుకోవడంతో శంకర్‌ ఇన్నింగ్స్‌కు తొందరగానే బ్రేక్‌ వేశాడు. ఆపై 18 ఓవర్‌ను కరణ్‌ శర్మకు బౌలింగ్‌కు దింపాడు ధోని. ఆ సమయంలో పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు బౌలింగ్‌ ఇస్తారనుకున్నారంతా. ఎందుకంటే అప్పటికి ఒకే ఓవర్‌ వేసి ఉన్నాడు కాబట్టి ఠాకూర్‌ చేతికి బౌలింగ్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ ధోని లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మను బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ఒకే ఓవర్‌ వేసి ఐదు పరుగులే ఇచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ను వదిలేసి లెగ్‌ స్పిన్‌తో ఏమి మ్యాజిక్‌ చేస్తాడనిపించింది. ఆ ఓవర్‌ తొలి బంతికి ఫోర్‌ కొట్టాడు విలియమ్సన్‌. ఆ తర్వాత బంతికి లాంగాన్‌ ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని.. కరణ్‌ అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌లో లెంగ్త్‌ బాల్‌ను వేశాడు.

ఆ బాల్‌ కూడా స్లోగా అవుట్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ లెంగ్త్‌లో పడటంతో దాన్ని స్లాగ్‌ స్వీప్‌ కొట్టడానికి యత్నించాడు విలియమ‍్సన్‌.  కానీ స్ట్రోక్‌ సరిపోక అది గాల్లో లేచింది. దాంతో దాన్ని ఠాకూర్‌ క్యాచ్‌గా పట్టుకున్నాడు. అంటే ఇక్కడ కూడా ధోని వ్యూహం సక్సెస్‌ అయ్యింది.  నియంత్రణగా పరుగులు వేసిన పేసర్‌ను పక్కను పెట్టి లెగ్‌ స్పిన్నర్‌కు బౌలింగ్‌ ఇవ్వడంలో ధోని అనుభవం కనబడింది. కేన్‌ విలియమ్సన్‌-విజయ్‌ శంకర్‌ల జోడి ప్రమాదకరంగా మారకుండానే వారు వరుస ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరడంతో సీఎస్‌కే గెలుపుపై ఆశలు చిగురించాయి.  ప్రత్యేకంగా విజయ్‌ శంకర్‌-విలియమ్సన్‌లు స్లాగ్‌ ఓవర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేస్తారనే వూహించిన ధోని.. అందుకే తగ్గట్టే బౌలింగ్‌ను ఇవ్వడమే కాకుండా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన విధానం మునపటి ధోనిని మరోసారి చూసినట్లయ్యింది. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్‌ వాట్సన్‌(42; 38 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు(41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. . సీఎస్‌కే నిర్దేశించిన 168 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ 147 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 

మరిన్ని వార్తలు