Who Is Mukesh Kumar: టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్‌ కుమార్‌?

3 Oct, 2022 15:41 IST|Sakshi

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. కాగా ఈ జట్టులో ముఖేష్‌ కుమార్‌, రజత్‌ పాటిదార్‌ వంటి కొత్త ముఖాలకు చోటు దక్కింది. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో వీరిద్దరినీ సెలక్టర్లు ప్రోటీస్‌తో సిరీస్‌కు అవకాశం ఇచ్చారు.ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ధావన్‌కు డిప్యూటీగా శ్రేయస్‌ అయ్యర్‌ వ్యవహరించనున్నాడు.

కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్‌ సారథ్యంలోని భారత సీనియర్‌ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక తొలి సారి భారత జట్టులో చోటు సంపాదించుకున్న పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ ముఖేష్‌ కుమార్‌?
28 ఏళ్ల ముఖేష్‌ కుమార్‌ కోల్‌కతాలో జన్మించాడు.
అతడు దేశీవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముఖేష్‌ 2015లో హర్యానా పై అరంగేట్రం చేశాడు.
అదే విధంగా టీ20 క్రికెట్‌లో 2016లో గుజరాత్‌ డెబ్యూ చేశాడు.
లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్‌.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు.
ఇక టీ20 క్రికెట్‌లో ముఖేష్‌ 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు.
ఇక తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు.
స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ సిరీస్‌లో ముఖేష్‌ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్‌.. బెంగాల్‌ జాయింట్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.
ముఖేష్‌ ప్రస్తుతం ఇరానీ కప్‌-2022లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తరపున ఆడుతున్నాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్‌గా ధావన్‌

మరిన్ని వార్తలు