రికార్డు బ్రేక్‌ చేసిన ఐపీఎల్‌ మ్యాచ్‌

22 Sep, 2020 15:47 IST|Sakshi
ఐపీఎల్‌ ఆరంభపు మ్యాచ్‌లో టాస్‌ వేసే సమయంలో ధోని-రోహిత్‌(ఫోటో కర్టసీ:పీటీఐ)

అబుదాబి: ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆరంభపు మ్యాచ్‌ సరికొత్త రికార్డును నమోదు చేసింది. అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)- ముంబై ఇండియన్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ రికార్డు వ్యూస్‌ను సాధించింది. ఆ మ్యాచ్‌ను ఓవరాల్‌గా 20 కోట్ల మంది క్రికెట్‌ ప్రియులు వీక్షించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సెక్రటరీ జై షా తన ట్వీటర్‌ అకౌంట్‌లో తెలిపారు.ఇది సరికొత్త ఫీట్‌లను నమోదు చేసినట్లు పేర్కొన్నారు.  దీన్ని  బార్క్‌ తన సర్వేలో స్పష్టం చేసిన జై షా వెల్లడించారు. ఇలా ఒక ఓపెనింగ్‌ స్పోర్టింగ్‌ ఈవెంట్‌ను 20 కోట్ల మంది వీక్షించడం ఏ దేశంలోనైనా, ఏ క్రీడల్లోనైనా ఇది తొలిసారి అని తెలిపారు. ఇప్పటివరకూ ఏ లీగ్‌లో కూడా ఇంతటి ఆదరణ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు రాలేదన్నారు. (చదవండి: కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?)

ఈ మ్యాచ్‌ ద్వారా సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని  అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై విజయంతో ధోని నయా రికార్డును లిఖించాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 100 విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2019 ప్రపంచకప్‌ తర్వాత దాదాపు 437 రోజలు పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని నిన్న జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ద్వారా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఇన్ని రోజుల విరామం తర్వాత కూడా తన కూల్‌ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అభిమానులకు చూపించాడు. ఆగస్టు 15 సాయంత్రం  7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్‌ పవర్‌ చూపించగా, డుప్లెసిస్(58 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు.

మరిన్ని వార్తలు