కింగ్స్‌ పంజాబ్‌పై ముంబైదే పైచేయి

1 Oct, 2020 23:29 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌( ఫోటో కర్టసీ: ట్వీటర్‌)

అబదాబి: కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన ముంబై.. ఆపై కింగ్స్‌ పంజాబ్‌ను కట్టడి చేసి గెలుపును ఖాతాలో  వేసుకుంది. నేటి మ్యాచ్‌లో ముంబై తడబడుతూ బ్యాటింగ్‌ ఆరంభించినా చివర్లో చెలరేగిపోయింది. దాంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.  అటు తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ను ఆదిలోనే దెబ్బకొట్టింది. ఫామ్‌లో ఉన్న మాయంక్‌ అగర్వాల్‌(25), కేఎల్‌ రాహుల్‌(17)లను భారీ స్కోర్లు చేయకుండా చేసి ముంబై  ఆదిలోనే పైచేయి సాధించింది. కరుణ్‌ నాయర్‌(0), మ్యాక్స్‌వెల్‌(11)లు తీవ్రంగా విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌(44; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జట్టుకు సరిపడా ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. గౌతమ్‌(22 నాటౌట్‌; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో బ్యాట్‌ ఝుళిపించాడు.  దాంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బౌల్ట్‌, కృనాల్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు.(చదవండి: వారెవ్వా ముంబై.. వాటే బ్యాటింగ్‌)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ, పొలార్డ్‌, హార్దిక్‌లు రాణించడంతో ముంబై బోర్డుపై భారీ స్కోరును ఉంచింది. రోహిత్‌(70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లు), పొలార్డ్‌(47 నాటౌట్‌; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా( 30 నాటౌట్‌; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి కింగ్స్‌ పంజాబ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది.  ముంబై బ్యాటింగ్‌ను ఎ‍ప్పటిలాగే రోహిత్‌-డీకాక్‌లు ఆరంభించారు. 

కాగా, తొలి ఓవర్‌లో ముంబైకు షాక్‌ తగిలింది. డీకాక్‌ పరుగులేమీ చేయకుండా కాట్రెల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌(10) రనౌట్‌ అయ్యాడు. దాంతో 21 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో  ఇషాన్‌ కిషన్‌(28)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.  ఈ జోడి 62 పరుగుల జోడించిన తర్వాత గౌతమ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. ఇక స్లాగ్‌ ఓవర్లలో రోహిత్‌-పొలార్డ్‌లు బ్యాట్‌ ఝుళిపించడంతో పాటు హార్దిక్‌ కూడా ఆకట్టుకోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసిన ముంబై.. మరో ఐదు ఓవర్లలో 89 పరుగులు చేసి వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. గౌతమ్‌ వేసిన చివరి ఓవర్‌లో 25 పరుగులు రాగా, పొలార్డ్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టాడు. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు సాధించిన ముంబై మ్యాచ్‌ ముగిసేసరికి సాధారణ స్కోరుకే పరిమితం అవుతుందనే ఆశించిన తరుణంలో బోర్డుపై 190పరుగులకు పైగా మార్కును ఉంచడం విశేషం. కింగ్స్‌ బౌలర్లలో కాట్రెల్‌, షమీ, గౌతమ్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు