'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్‌ ఆడను'

23 Feb, 2021 19:21 IST|Sakshi

ఢాకా: ఐపీఎల్‌ కంటే దేశం తరపున ఆడడమే తనకు ముఖ్యమని బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ స్పష్టం చేశాడు. ఏప్రిల్‌లో మొదలవనున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌ సమయంలోనే బంగ్లా క్రికెట్‌ బోర్డు(బీసీబీ) లంకతో టెస్టు సిరీస్‌ ఆడాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. కాగా బీసీబీ నిర్ణయం తీసుకున్న రోజే తాను ఐపీఎల్‌ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ కోరాడు.దీనిపై నిరాశ చెందిన బీసీబీ ఐపీఎల్‌ ఆడాలనుకునేవారికి ఎన్‌వోసీ ఇస్తామని... లీగ్‌లో పాల్గొనే వారిని తాము అడ్డుకోమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్‌ స్పందించాడు. ' నాకు దేశ భక్తి ఎక్కువ. ఐపీఎల్‌ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తా. బంగ్లా బోర్డు ఏది చెబితే అదే చేస్తా. ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు నా పేరును ప్రకటిస్తే దేశానికి ఆడేందుకే ప్రాధాన్యమిస్తా.  ఐపీఎల్‌ దృష్యా ఒకవేళ బోర్డు లంకతో సిరీస్‌కు తన పేరును పరిగణలోకి తీసుకోకుంటే ఆ విషయం వాళ్లే స్వయంగా చెబుతారు. వారు ఎన్‌వోసీ ఇచ్చేవరకు వేచిచూస్తా.. అప్పుడే ఐపీఎల్‌లో ఆడేందుకు వెళ్తా. ఐపీఎల్‌లో పాల్గొనమని బోర్డు ఎన్‌వోసీ ఇచ్చినా నా మొదటి ప్రాధాన్యం దేశ భక్తిపైనే ఉంటుంది.' అని రెహ్మాన్‌ స్పష్టం చేశాడు.

కాగా ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ కనీస ధర రూ. కోటికి దక్కించుకోగా.. ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ను కేకేఆర్‌ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్‌ తరపున ముస్తాఫిజుర్‌ 14 టెస్టు‍ల్లో 30 వికెట్లు, 61 వన్డేల్లో 115 వికెట్లు, 41 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన ముస్తాఫిజుర్‌ చక్కగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆ ఏడాది ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్‌ మొత్తం 24 మ్యాచ్‌లాడి 24 వికెట్లు తీశాడు.
చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ
సన్‌రైజర్స్‌కు వార్నర్‌ షాక్‌ ఇవ్వనున్నాడా!

మరిన్ని వార్తలు